ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌


ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌

15 మంది మావోయిస్టుల మృతి


రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. సుక్మా జిల్లాలోని కుంట, గొల్లపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన ఎదురుకాల్పుల్లో 15 మంది మావోయిస్టులు హతమైనట్లు తెలుస్తోంది. గొల్లపల్లి అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ నిర్వహిస్తున్న భద్రతా బలగాలకు మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో రెండు వర్గాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. భద్రతా బలగాల కాల్పుల్లో 15 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. గొల్లపల్లి ప్రాంతంలో కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. ఎన్‌కౌంటర్‌ జరిగినట్లు జిల్లా ఎస్పీ ధ్రువీకరించారు.
గొల్లపల్లి అటవీప్రాంతంలో దాదాపు 200 మంది మావోయిస్టులు సమావేశమైనట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందిందని.. వెంటనే కూంబింగ్‌ చేపట్టినట్లు యాంటీ నక్సల్స్‌ ఆపరేషన్‌ ప్రత్యేక డీజీ డీఎం అవస్థీ తెలిపారు. ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రదేశం నుంచి 16 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

 
పక్కా నిఘా..
మావోయిస్టుల కార్యకలాపాలపై దృష్టి సారిస్తున్న ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు మావోయిస్టు ప్రాబల్య అటవీ ప్రాంతాల్లో బేస్ క్యాంపులు ఏర్పాటు చేసుకుని కూంబింగ్ నిర్వహిస్తున్నారు. బేస్ క్యాంపులను కేంద్రంగా చేసుకుని మావోయిస్టుల ఉనికిపై ఎప్పటికప్పుడు నిఘా వేస్తున్న పోలీసు బలగాలు.. ఇవాల్టి ఎన్‌కౌంటర్‌ను విజయవంతంగా పూర్తి చేయగలిగారు. సంఘటనా స్థలంలో 16ఆయుధాలు, మరికొన్ని నాటు తుపాకులు కూడా స్వాధీనం చేసుకున్నారు.
మావోయిస్టులకు గట్టిదెబ్బ..
గత నెలలో బీజాపూర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 8మంది మావోయిస్టులు మృతిచెందిన సంగతి తెలిసిందే. వరుస ఎన్‌కౌంటర్లతో తీవ్రంగా నష్టపోయి తమ ఉనికి ప్రశ్నార్థకంగా మారిన వేళ.. తాజా ఎన్‌కౌంటర్‌తో మావోయిస్టులకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. మావోయిస్టుల వారోత్సవాలు ముగిసిన కొద్ది రోజుల్లోనే ఈఘటన చోటుచేసుకోవడం గమనార్హం. అయితే, మావోయిస్టులు కూడా ప్రతీకార దాడులకు పాల్పడే అవకాశం ఉన్నందున భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు.

Comments

Popular posts from this blog

కనిపిస్తే కబ్జా!